నిన్న ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ప్రముఖ రాష్ట్రానికి త్వరలో గవర్నర్ గా వెళ్ళబోతున్నాడు అంటూ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు కృష్ణంరాజుకు ఈపదవిని ఇచ్చే విషయంలో భారతీయ జనతాపార్టీ అధినాయకత్వం ప్రభాస్ ను భారతీయ జనతా పార్టీలో చేర్చాలి అని కండిషన్ పెట్టినట్లు కూడ ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.
ఆకథనంలోని వాస్తవాలు ఎన్నో తెలియకపోయినా నిజంగానే ప్రభాస్ రానున్న ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ తరఫున ప్రచారం చేస్తాడా అన్న ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి. వాస్తవానికి కృష్ణంరాజుకు గవర్నర్ పదవి వస్తుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్ళీ ఈవార్తలు రావడం సంచలనంగా మారింది.
గత పార్లమెంట్ ఎన్నికల ముందు 2014 లో ప్రభాస్ కృష్ణంరాజుతో కలిసి నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిసిన సందర్భం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆతరువాత ప్రభాస్ ‘బాహుబలి’ తో బిజీ అయిపోవడంతో ఆవార్తలకు ప్రాధాన్యత రాలేదు. ఈమధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వివిధ భాషలకు చెందిన సినిమా సెలెబ్రెటీలను బిజేపీ వైపు ఆకర్షితులు అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాదికి సంబంధించి మోహన్ లాల్ ప్రభాస్ రజినీకాంత్ లను ఏదోవిధంగా బిజేపీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే తాము నటిస్తున్న సినిమాల వంకను చూపెట్టి వీరంతా బిజేపీ ఒత్తిడి నుండి తప్పించుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ నిజంగానే తన పెదనాన్న కృష్ణంరాజు కోసం రానున్న ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేస్తాడా అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఇండియన్ టాప్ సెలెబ్రెటీ స్థాయిని అందుకున్న ప్రభాస్ నిజంగానే బిజెపి కోసం ప్రచారం చేస్తే అతడి మ్యానియా వల్ల ఓట్లు పడతాయా లేదా అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి..