టాలీవుడ్ లో బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు తీసిన దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు వారు సైతం ఇంత గొప్ప వ్యూజువల్ వండర్ సినిమాలు తీయగలరు అని నిరూపించారు. దాంతో రాజమౌళి భారతీయ సినీ పరిశ్రమలో పాపులర్ దర్శకులు అయ్యారు. బాహుబలి 2 తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకున్న రాజమౌళి మరో వండర్ సృష్టించబోతున్నారు. ఈ సారి గ్రాఫిక్స్ కి ఎక్కువ అవకాశం లేకుండా సీనీ హీరోలతో దుమ్మురేపబోతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ సినిమా తీయబోతున్నారు.
'ఆర్ ఆర్ ఆర్' అనే వర్కింగ్ టైటిల్ మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో ఇతర నటీనటులకు సంబంధించిన సమాచారం ఇంతవరకూ బయటికి రాలేదు. ఈ మధ్య ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం తమిళ నటుడు .. దర్శకుడు సముద్రఖనిని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో కీలక పాత్ర చేస్తావా? అని దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నానని అంటున్నారు.
నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్’ సినిమా చూసి రాజమౌళి సర్ నాకు ఓ పెద్ద మెసేజ్ పెట్టారు. అప్పటినుంచి నేను రాజమౌళి సర్తో టచ్లో ఉన్నాను. ఇటీవల ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తన కుటుంబీకుల్ని పరిచయం చేశారు. ఇదే సందర్భంలో ఆర్ఆర్ఆర్ లో ఓ ముఖ్యపాత్ర ఇస్తానని చెప్పడంతో చాలా సంతోషించాను. 'రఘువరన్ బీటెక్'లో ధనుశ్ తండ్రి పాత్ర ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.