తెలుగు ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్. హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే ‘జనసేన’పార్టీ స్థాపించాడు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ స్థాపించినా పోటీ చేయలేదు. బీజేపి, టీడీపికి మద్దతుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏపిలో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన బాబాయి..జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కి సంబంధించిన ఓ పాటను వీడియో రూపంలో తీసి విడుదల చేశారు. 'జనగనమనమాతడు.. జనసేనై కదిలాడు' అంటూ అత్యద్భుతంగా ఆ పాట కొనసాగుంది. మనలను ముందుకు నడప... వచ్చెర ఒకడు... అతడొక గంగానది... అతడొక హిమశిఖరం అంటూ జనాలకు ఆకట్టుకునేలా పాట ఉంది.
తన దృష్టిలో, లక్షలాది అభిమానుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే పాట ఇది అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఈ పాటకు అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి మంచి స్పందన వస్తోంది. జనసేన శ్రేణుల్లో ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.