‘జనసేన’ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు రిపబ్లిక్ డే నాడు విడుదల చేసిన పాటకు పవన్ అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. ‘ఒకడొచ్చాడు.. వచ్చాడు.. జాతిని జాగృతి గొలుప..’ అంటూ .సాగే ఈ పాట జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులను, జనసేన కార్యకర్తలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పవన్ చేపట్టిన కార్యక్రమాలతో ఈపాట సాగుతుంది.
అయితే ఈపాటను విడుదల చేస్తూ చరణ్ పవన్ ను ఉద్దేశించి అన్న కామెంట్స్ మరొకసారి వీరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాటను దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం చేస్తున్నా. నా దృష్టిలో లక్షలాది అభిమానుల దృష్టిలో అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది.. దీన్ని విని స్ఫూర్తి పొందండి. జై హింద్’ అని పోస్ట్ పెట్టాడు.
ప్రస్తుతం ఈపాటకు సోషల్ మీడియాలో ఆదరణ బాగానే ఉన్నా కేవలం ప్రచార గీతాలతో జనం ఓట్లు వేసే పరిస్థితి లేదు. దీనికితోడు జనసేన విధి విధానాల గురించి పవన్ కు ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో పాటు కేవలం గోదావరి జిల్లాలలో పవన్ తన పర్యటనలు కొనసాగిస్తూ రాయలసీమ అదేవిధంగా గుంటూరు కృష్ణ ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ‘జనసేన’ పటిష్టత కోసం పవన్ ఇప్పటికీ పట్టించుకోకపోవడం పవన్ అనుసరిస్తున్న వ్యూహాత్మిక తప్పిదం అని అంటున్నారు.
ఇలాంటి పరిస్థుతులలో ‘జనసేన’ కు కార్యకర్తల బలం కావాలి కానీ సినిమా ఫక్కీలో కొనసాగే పాటల జోష్ కాదు. ఈ నేపధ్యంలో పవన్ అభిమానులకు నేడు విడుదల చేసిన పాట జోష్ ను ఇస్తున్నా ప్రచార విషయంలో అదేవిధంగా అభ్యర్ధుల ఎంపిక విషయంలో పవన్ అనుసరిస్తున్న గందరగోళం ‘జనసేన’ కు ఏమాత్రం మేలు చేయదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..