మణికర్ణిక విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు క్రిష్ హీరోయిన్ కంగనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిత్రాన్ని చాలావరకూ క్రిష్ దర్శకత్వం వహించిన తర్వాత దాని మిగిలిన భాగం స్వయంగా కంగన రనౌత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అసలు కంగనతో తనకు ఎక్కడ చెడిందో దర్శకుడు క్రిష్ బయటపెట్టాడు.
సినిమా షూటింగ్ తన దర్శకత్వంలో దాదాపు పూర్తయిన తర్వాత కంగన దానిలో మార్పులు చేయాలని పట్టుబట్టారని క్రిష్ చెప్పారు. సినిమా నిర్మాత కమల్ జైన్ కూ తనకూ మధ్య జగడం పెట్టేందుకు కంగన ప్రయత్నించిందని క్రిష్ ఓ పత్రికతో తెలిపారు. ఈ సినిమాలో కీలక పాత్ర సదాశివరావును సోనూసూద్ పోషించాడు.
సోనూసూద్ పాత్రను షూటింగ్ మొత్తం పూర్తయ్యాక 100నిమిషాల నుంచి 60 నిమిషాలకు కుదించాలని కంగన పట్టుపట్టిందని క్రిష్ తెలిపాడు. అంతేకాకుండా చరిత్రను వక్రీకరిస్తూ ఆ పాత్రను ఇంటర్వల్ కు ముందే చంపేయాలని కంగన తనకు చెప్పారని క్రిష్ అన్నాడు. ఇలా తలాతోకా లేకుండా మార్పులు చేయాలని చెప్పడంతో తాను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నానని క్రిష్ చెప్పాడు.
అంతే కాదు.. మణికర్ణిక సినిమా టీజర్లలో తన పేరును క్రిష్ అని కాకుండా రాధాకృష్ణ జాగర్లమూడి అని వేశారని.. తనను అలా ఎవరూ పిలవరని క్రిష్ తెలిపాడు. తనకు క్రెడిట్ రాకుండా కొట్టేసేందుకే కంగన అలా వేయించారని.. దర్శకురాలిగా తన పేరు వేసుకుని కంగన ఎలా ప్రశాంతంగా ఉంటుందో అర్థంకావడం లేదని క్రిష్ విమర్శించారు. దర్శకురాలి పాత్రకు కంగన ఏమాత్రం అర్హురాలు కాదని క్రిష్ తప్పుబట్టారు.