ఈ మద్య బాలీవుడ్ చిత్రాలు ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే ముఖ్యపాత్రలో నటించిన ‘పద్మావత్’ఎన్నో వివాదాల మద్య రిలీజ్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ క్విన్ కంగనా రౌనత్ ముఖ్యపాత్రలో నటించిన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. మొదటి నుంచి ఈ చిత్రం ఎన్నో వివాదాలకు కేంద్రబింధువగా నిలిచింది. మొదట ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన మద్యలోనే డ్రాప్ అయ్యారు..ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలు కంగనా రౌనత్ చేపట్టారు.
మొత్తానికి క్రిష్ - కంగనా సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లక్ష్మీబాయి లుక్ తో కంగనా నూటికి నూరు మార్కులు కొట్టేయడంతోనే ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక టీజర్ .. ట్రైలర్ బయటికి వచ్చిన తరువాత అంచనాలు మరింతగా పెరిగాయి. తొలిరోజు ఆశించిన వసూళ్లు లేకున్నా మెల్లగా పుంజుకున్న మణికర్ణిక రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. హిందీ, తమిళ్, తెలుగు వెర్షన్లు కలిపి భారత్లో ఈ చిత్రం మొత్తం 42.55 కోట్లను రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో ఝాన్సీ లక్ష్మీభాయిగా ప్రేక్షకులను అలరించడంతో వసూళ్లు జోరందుకున్నాయి.
దేశవ్యాప్తంగా 3 రోజుల్లో 42.55 కోట్లను వసూలు చేసింది. ఓవర్సీస్ లోను ఈ చిత్రం వసూళ్లపరంగా తన దూకుడు చూపుతోంది. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిపోయింది. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో నిర్మించిన మణికర్ణిక దేశవ్యాప్తంగా 3000 స్క్రీన్లపై ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ మున్ముందు బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగిస్తే చాలా తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందనే అభిప్రాయాన్ని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.