తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కథా, గేయ రచయితలు వచ్చారు...అందులో ఓ చిత్రం పేరునే తన పేరుగా మల్చుకున్న కథా, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సిరివెన్నల’చిత్రంతో తన ప్రస్థానం మొదలు పెట్టిన సీతారామశాస్త్రి...ఆ చిత్రం పేరును తన పేరు ముందు పెట్టుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరివెన్నెల ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు.
ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ కలసి చాలా సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. మా అధ్యక్షుడు శివాజీరాజా, త్రివిక్రమ్ శ్రీనివాస్, బుర్రా సాయిమాధవ్, ఆర్పీ పట్నాయక్ తదితరులు కూడా సిరివెన్నెలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.