బయోపిక్ ల యుగం నడుస్తందిప్పుడు.. ఓ వైపు ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంటే.. మరోవైపు దానికి ప్రతిగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సిద్దమవుతోంది. ఇదే సమయంలో వైఎస్ బయోపిక్ గా చెప్పుకుంటున్న యాత్ర సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.
ఐతే.. బయోపిక్ సినిమాలపై చాలా ఆంక్షలు ఉంటాయి. ఫలానా సీన్ వద్దని.. ఆ ఎపిసోడ్ టచ్ చేయవద్దని షరతులు రావడం కామన్. కానీ వైఎస్ బయోపిక్ గా చెప్పుకుంటున్న యాత్ర సినిమా విషయంలో మాత్రం తనకు అలాంటి షరతులు ఏమీ రాలేదంటున్నారు ఆ సినిమా దర్శకుడు మహి రాఘవన్.
యాత్ర సినిమా పూర్తయ్యాక దాన్ని వైఎస్ జగన్కు చూపించాలని అనుకున్నారట దర్శకుడు మహి రాఘవన్. అంతుకు ముందు ఈ సినిమా టీజర్ ను జగన్ చేతుల మీదుగానే విడుదల చేయించారాయన. కానీ వైఎస్ జగన్ మాత్రం మహి రాఘవన్కు షాక్ ఇచ్చారట.
మీరు ఓ కాన్సెప్టుతో సినిమా చేస్తారు.. దాన్ని నేను చూసి నా అభిప్రాయాలు చెబితే.. దాని సహజత్వం చెడుతుంది. అందుకే సినిమా విడుదలయ్యాకే చూస్తా అన్నారట జగన్. వైఎస్ పాదయాత్రలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.