ఈశ్వర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చక్ర క్రియేషన్స్‌ పతాకంపై దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించిన సినిమా ‘4 లెటర్స్‌’. కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే... అనేది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్‌. రఘురాజ్‌ దర్శకత్వం వహించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ‘జెమిని’ కిరణ్‌ ఓం శ్రీ చక్ర క్రియేషన్స్‌ సంస్థ లోగోను విడుదల చేశారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా న్యూ ట్రైలర్‌ విడుదల చేశారు. నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి ఆడియో బిగ్‌ సీడీ విడుదల చేశారు. 


ఆడియో ఫంక్షన్‌కి అతిథిగా హాజరైన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ ‘‘సినిమా మీద ప్రేమ ఉండాలి గానీ.. న్యూయార్క్‌లో ఉన్నా, అంటార్కిటికాలో ఉన్నా ఆ ప్రేమ ఎక్కడికీ పోదు. ప్రతి ఒక్కరూ సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీకి వస్తారు. ఏ రంగంలో అయినా ప్రేమ పక్కకు వెళ్తుందేమో కానీ... సినిమాలోని 24 శాఖలపై ప్రేమకు వెళ్ళదు. ఆ ప్రేమతో నిర్మాతలు న్యూయార్క్‌ నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. ‘4 లెటర్స్‌’ హీరో హీరోయిన్లకు మంచి పేరు, నిర్మాతలకు లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. నాకు సీనియర్‌, టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌ సురేష్‌ సినిమా బాగా వచ్చిందని చెప్పారు. హీరో ఈశ్వర్‌ మంచి హీరో అవ్వాలని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.


ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘సినిమా సాంగ్స్‌ చూస్తే... హీరో ఎనర్జీ లెవల్స్‌ సూపర్‌. కుమ్మేశాడు. కంగ్రాచ్చులేషన్స్‌. ఈశ్వర్‌కి ఓ గొప్ప కల ఉంది. కమర్షియల్‌ హీరోగా ఎదగాలని అనుకుంటున్నాడు. ఆ కలను నిజం చేసుకోవడానికి అతని చేతుల్లో ఏం లేదు. కల నిజం కావడం ఇంపాజిబుల్‌. మరి, ఎలా నిజమైంది? అతని తండ్రి, తల్లి, కుటుంబం అండగా నిలబడి ఆ కలను నిజం చేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే ఓ కుర్రాడు చదువులో ఎలా పైకి రాడో... అలాగే ఓ ప్రొఫెషన్‌లో పైకి రాలేడు. ఈశ్వర్‌కి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆశీర్వాదం ఉండబట్లే తెరపై హీరోగా వస్తున్నాడు. ప్రేక్షకులకు చక్కటి సినిమా అందివ్వాలని వారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని అనడానికి ఈ రోజు విడుదలైన పాటలు  చక్కటి ఉదాహరణ. ఫోక్‌ సాంగ్స్‌ బావున్నాయి. 


అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘‘చిన్న చిత్రాలు హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. ఒక టేస్ట్‌తో, క్వాలిటీతో, నమ్మకంతో తీసిన సినిమా ఇదని వచ్చాను. పాటలు, ట్రైలర్‌ చూశాక... ఇది చిన్న సినిమా కాదని అనిపిస్తుంది. కాబోయే పెద్ద హిట్‌ సినిమా అనిపించింది. ప్రేక్షకులకు ఎంత బడ్జెట్‌లో తీశారు? ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారు? ఎంతమంది స్టార్స్‌ ఉన్నారు? అనేది పాయింట్‌ కాదు. సినిమా ఇంట్రెస్టింగ్‌గా, మనకు నచ్చేలా ఉందా? లేదా? మనల్ని ఎంటర్‌టైన్‌ చేసిందా? లేదా? అనేది పాయింట్‌. అందుకు ఉదాహరణ... తాజా ‘హుషారు’. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాలు లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. ఆ స్ఫూర్తితో తన కుమారుడు ఈశ్వర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఉదయ్‌కుమార్‌గారు ఈ సినిమా చేశారు. కుర్రాళ్ళకు కావాల్సిన మసాలాను దట్టిస్తూ రఘురాజ్‌ సినిమా తీశారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. భీమ్స్‌ పేరులో ఉన్న బలం, పాటల్లో కనిపించింది’’ అన్నారు.


చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘నేను అమెరికాకు ఓ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వెళ్ళాను. అందులో ఈశ్వర్‌ గాయకుడిగా పాల్గొన్నాడు. అతను గాయకుడు. మంచి విద్యార్థి. నాట్యం బాగా చేస్తాడు. అతడి బహుముఖ ప్రతిభకు చక్కటి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నా. అమెరికాలో ఉదయ్‌కుమార్‌ నన్ను బాగా చూసుకున్నారు. ఆయన పిలిస్తే ఇక్కడికి వచ్చా. వచ్చాక భీమ్స్‌ సంగీత దర్శకుడని తెలిసింది. భీమ్స్‌ అంటే నాకు ప్రత్యేక అభిమానం. తన శైలి, తన పద్ధతి నాకు బాగా నచ్చుతాయి. పాటలు రాసిన సురేశ్‌... ప్రేక్షకుల నాడి తెలిసిన గీత రచయిత’’ అన్నారు.


దర్శకుడు ఆర్‌ రఘురాజ్‌ మాట్లాడుతూ ‘‘సినిమాలకు చాలా అద్భుతాలు జరిగాయి. ఫస్ట్‌... సినిమా షూటింగ్‌ 75 రోజుల్లో పూర్తి చేశాం. దీనికి మా టీమ్‌ కారణం. మంచి మెసేజ్‌తో తీసిన సినిమా ఇది. ఒకరోజు ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తుంటే... ‘సైన్స్‌ ఈజ్‌ అబౌట్‌ థింకింగ్‌. ఇంజనీరింగ్‌ అబౌట్‌ డూయింగ్‌. బట్‌, ఆల్‌ ఇంజనీయర్స్‌ ఆర్‌ డయింగ్‌’ అని ఒక బోర్డ్‌ చూశా. మా డ్రైవర్‌ని అడిగితే... అతనూ బీటెక్‌ స్టూడెంట్‌ అని తెలిసింది. అప్పుడు వచ్చిన ఆలోచనతో ఈ సినిమా తీశా. ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌కి ఈ సినిమా అంకితం ఇస్తున్నాం. సినిమా సెకండాఫ్‌లో డిఫరెంట్‌ పాయింట్‌ టచ్‌ చేశాం. ‘లవ్‌ ఎట్‌ సెవన్‌ లుక్‌’ కాన్సెప్ట్‌తో చేశా. నిర్మాతలు చాలా సపోర్ట్‌ చేశారు. నేను అడిగిన ఆర్టిస్టులు ఇచ్చారు. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.


నిర్మాత ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘నేను అమెరికాలో, న్యూయార్క్‌ సిటీలో సెటిలైన తెలుగు ఫ్యామిలీ మాది. 21 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నా. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. మా ఇంట్లో తెలుగు వాతావరణం కనిపిస్తుంది. మా అమ్మాయి భరతనాట్యం కళాకారిణి. మా అబ్బాయిని డాక్టర్‌ చేయాలనుకున్నాం. తను యాక్టర్‌ అవుతానని చెప్పడంతో సత్యానంద్‌గారి దగ్గరకి పంపాను. సినిమాలపై ప్రేమతో ‘4 లెటర్స్‌’ తీశాం. ఇంజనీరింగ్‌ నేపథ్యంలో తీసిన ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయాలనుకుంటున్నాం. ట్రైలర్స్‌, సాంగ్స్‌ చూసి అందరూ మా అబ్బాయి బాగా చేశాడని అంటుంటే సంతోషంగా ఉంది. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు, కొత్తవారితో సినిమాలు తీయాలనుకుంటున్నా’’ అన్నారు.


హీరో ఈశ్వర్‌ మాట్లాడుతూ ‘‘నేను అమెరికాలో చదువున్నా. అయితే సినిమాలు అంటే ఎప్పటినుంచో ఇష్టం. ఇండియా వచ్చినప్పుడు కాస్త నెర్వస్‌గా ఉండేది. దర్శకుడు రఘురాజ్‌గారితో మాట్లాడితే షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే రెండు నెలల ముందు వర్క్‌షాప్స్‌ చేద్దామన్నారు. మా దర్శకుడు నాకు బాడీ లాగ్వేంజ్‌, వర్క్‌ డిసిప్లేన్‌ అన్నీ నేర్పించారు. నేను సత్యానంద్‌గారి నటనలో శిక్షణ తీసుకున్నా. ఫ్యామిలీలో అందరికీ ఇంట్రెస్ట్‌ ఉండటంతో, ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్‌ కావాలని ఈ సినిమా నిర్మించడానికి అమ్మానాన్న అంగీకరించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు భీమ్స్‌, సీనియర్‌ నటుడు సురేష్‌, కొరియోగ్రాఫర్‌ గణేష్‌, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: