వైఎస్ఆర్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న మూవీ ‘యాత్ర’ ఈ వారం విడుదల కాబోతోంది. పూర్తిగా వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కాకుండా వైఎస్ ను మొదటిసారి అధికారంలోకి తీసుకు వచ్చిన పాదయాత్ర విషయాన్ని కీలకంగా చూపెడుతూ తీసిన ఈమూవీ చిత్రీకరణలో దర్శకుడు మహి.వి.రాఘవ్ ప్రతిభ ప్రతి సీన్ లో కనిపిస్తుంది అని వార్తలు వస్తున్నాయి.
ఈసినిమా ప్రీరిలీజ్ వేడుక మొన్న హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుక ఆద్యంతం వైయస్ జగన్ అభిమానులు రచ్చ రచ్చ చేశారు. అయితే ఈ ఫంక్షన్ కు వైయస్ జగన్ రాకపోవడం పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రం వైఎస్సాఆర్ కాంగ్రెస్ తెర వెనుక ఉండి నిర్మించింది అని వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘యాత్ర’ వేడుకలో జగన్ మిస్ అవ్వడం పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఇది అంతా ఒక వ్యూహం ప్రకారమే నడిచిందని ‘యాత్ర’ మూవీ ఫలితం జగన్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ లపై ఎటువంటి ప్రభావం చూపించకూడదు అన్న ఉద్దేశ్యంతో ‘యాత్ర’ మూవీ ఫంక్షన్ కు జగన్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ఫెయిల్యూర్ తెలుగుదేశ వర్గాలకు షాక్ ఇచ్చిన నేపధ్యంలో అలాంటి పరిస్థితి తనకు ఏర్పడ కూడదని జగన్ ఈమూవీ విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టాక్.
ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ని భారీ మొత్తాలకు కొనుక్కుని బయ్యర్లు నష్టపోయిన నేపధ్యంలో అలాంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుందేమో అన్న భయంతో ‘యాత్ర’ మూవీకి బిజినెస్ జరగలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈమూవీకి క్రేజ్ తీసుకు రావాలని మమ్ముట్టిని స్వయంగా రంగంలోకి దింపి మీడియా సంస్థలకు అతడి చేత ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఈసినిమాకు పోటీ ఇచ్చే మరే సినిమా ఈవారంలో విడుదల కాని నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కనీసం ఒక్కసారి చూసినా ఈమూవీకి మంచి కలక్షన్స్ రావడం ఖాయం..