పవన్ ‘జనసేన’ విధానాలు నచ్చి ఎన్నారై పులి శేఖర్ జనసేన పార్టీలో చేరిన విషయం రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. ‘జనసేన’ అధినేత పవన్ కళ్యా ణ్శేఖర్ ను ‘జనసేన’ సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్ గా నియమించడం హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య కాలంలో ‘జనసేన’ లో వివిధ రంగాలకు అదే విధంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన కొందరు కీలక వ్యక్తులు చేరుతున్న నేపధ్యంలో ఇప్పడు కొత్తగా చేరిన పులి శేఖర్ ఎవరు అన్న విషయమై జనసేన వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.
ఆశాజ్యోతి సంస్థ ద్వారా ఏటా 5వేల మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తూ అమెరికాలోని సాఫ్ట్వేర్ సంస్థల నిర్వాహకుడుగా శేఖర్ పులికి మంచి పేరు ఉంది. అమెరికాలోని డల్లాస్లో క్లౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఒక ప్రముఖ కంపెనీకి ఇతడు అధిపతి. తెలుస్తున్న సమాచారం మేరకు మచిలీపట్టణం నుంచి రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వెళ్ళి ఈయన అక్కడ సెటిల్ అయినట్లు తెలుస్తోంది.
శేఖర్ తాత నాయుడు నాగేశ్వరరావు స్వాతంత్ర పోరాటంలో కూడ పాల్గోన్నట్లు తెలుస్తోంది. భీమవరంలో ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసుకొని అమెరికాలో ఎంఎ స్చదివిన తరువాత అనేక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసిన శేఖర్ తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న కంపెనీ వందల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. ఈ సంస్థను ఇటీవల ప్రముఖ ఎంఎన్సీ టేకోవర్ చేసింది అని తెలుస్తోంది.
ఈ ఒప్పందంలో భాగంగా శేఖర్ మరో రెండు సంవత్సరాలు ఆ సంస్థతో కలిసి ఉండాలి. లేదంటే టేకోవర్ సందర్భంలో నిర్ణయించిన మొత్తంలో 25 శాతం వదులుకోవాలి. అయితే శేఖర్ ‘జనసేన’ కోసం 25 శాతం ఆదాయాన్ని వదులుకుని ఇప్పుడు ‘జనసేన’ లో చేరడమే కాకుండా ఆపార్టీ ప్రతిష్ఠ కోసం క్రియా శీలకంగా పనిచేయడానికి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాడు. విలువైన మేధో సంపద భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతోంది సరైన పాలనా విధానాలు అమలు అయితే విదేశాల నుంచి మన మేధో సంపద తిరిగి వస్తుంది అని తరుచు చెప్పే పవన్ భావజాలం తనను బాగా ఆకర్షించడంతో తాను ‘జనసేన’ లోకి వచ్చాను అని అంటున్నాడు ఈ ఎన్నారై. దీనికితోడు ‘జనసేన’ కు ఉన్న బలమైన ఏడు సిద్ధాంతాలు తనకు బాగా నచ్చాయని అందుకే పార్టీ నిర్వహణలో పాలుపంచుకునేందుకు తన సంస్థలను కూడా పక్కన పెట్టి తాను రాఆజకీయాలలోకి వచ్చాను అని అంటున్నాడు. ఈమధ్య కాలంలో ‘జనసేన’ లోకి సంపన్నులు బాగా చేరుతున్న నేపధ్యంలో ఈ చేరికలు ఇప్పటి వరకు పవన్ ‘జనసేన’ జెండాను మోసి అనేక త్యాగాలు చేసిన సాధారణ కార్యకర్తలకు కలవరం కలిగిస్తున్నాయి..