కొంతమంది కారణజన్ములు.! వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఆ కోవకే చెందుతారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. అయితే ఆయన హఠాన్మరణాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ఆయన చేసిన పనులు, ఆయన చేపట్టిన పథకాలు తెలుగువారందరికీ సుపరిచితమే..! ఈ నేపథ్యంలో ఆయన బయోపిక్ తీస్తున్నారనగానే ఆయన అభిమానులంతా ఉత్సాహంతో పొంగిపోయారు. ఇవాళ ఆయన బయోపిక్ యాత్ర రిలీజైంది.
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన యాత్ర సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వై.ఎస్. జీవిత చరిత్ర మొత్తం కాకుండా ఆయన రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన పాదయాత్రకు ముందు, ఆ తర్వాత పరిణామాలను మాత్రమే ఈ సినిమాలో చూపించారు. పాదయాత్రకు దారితీసిన పరిణామాలు, అధిష్టానం నుంచి ఎదురైన ఇబ్బందులు, ప్రజలకోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం.. లాంటి అనేక అంశాలను సినిమాలో దర్శకుడు మహి.వి.రాఘవ కళ్లకు కట్టారు. ఓవరాల్ గా వై.ఎస్. పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయారు.
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే సినిమా అంతా సాగుతుంది. యాత్రకు అధిష్టానం నుంచి ఇబ్బందులు తలెత్తడం, అయినా ఆయన ముందుకు వెళ్లడం, ఆ యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, ప్రజల నుంచి ఆయన నేర్చుకున్న అంశాలు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆయన చేపట్టిన ప్రజా పథకాలు.. లాంటి అనేక అంశాలను సినిమాలో చూపించారు. తన సాయం కోరి వచ్చిన వారికి సాయం చేయడం, మాట ఇస్తే మడమ తిప్పకుండా ముందుకెళ్లే నైజాన్ని వై.ఎస్. పాత్రలో కళ్లకు కట్టారు. అక్కడక్కడ కొన్ని కల్పిత పాత్రలు, సన్నివేశాలు ఉన్నా అవన్నీ సినిమాకు ప్రాణం పోశాయి.
సినిమాలో మమ్ముట్టి వై.ఎస్. పాత్రలో జీవించారు. డబ్బింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయమ్మ పాత్రలో ఆశ్రిత చక్కగా నటించారు. వై.ఎస్ అనుచరుడిగా రావు రమేష్ నటించారు. తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, సుచరిత పాత్రలో అనసూయ తదితరులు నటించారు. ఎన్నికలకు ముందు రిలీజైన వై.ఎస్. బయోపిక్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆయన అభిమానులకు మాత్రం కనువిందు చేసేలా ఉంది.