ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యాయి. ఈ నెల 22న ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన టీజర్ రేపు రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ ప్రకటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడిని ఎలా చూపిస్తారోననే భయం అభిమానుల్లో నెలకొంది.
ఇక 'మహానాయకుడు' చిత్రంతో పాటు థియేటర్లలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ ని స్క్రీన్ చేయబోతున్నారు. అయితే ఈ చిత్రంలో కొన్ని పాత్రలు నెగిటీవ్ గా చూపించబోతున్నారని..లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్న తర్వాత ఆమెతో కొంత మంది సన్నిహితంగా ఉంటూ వచ్చారు..ఇక ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆ సన్నిహితంగా ఉన్నవారే శత్రువులుగా మారారు. ఈ విషయం లక్ష్మీపార్వతి పలు మార్లు మీడియా ముందు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా చిత్ర పరిశ్రమకు సంబంధించి కొన్ని పాత్రలను చూపించబోతున్నారు. వాటిలో మోహన్ బాబు పాత్ర కీలకమని తెలుస్తోంది. ఎన్టీఆర్ కి సన్నిహితంగా ఉంటూ వచ్చిన మోహన్ బాబు.. లక్ష్మీపార్వతితో కూడా మోహన్ బాబు బాగానే ఉండేవారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ మరణించారో లక్ష్మీపార్వతికి మోహన్ బాబుకి మధ్య గ్యాప్ వచ్చింది. ఒకానొక సందర్భంలో లక్ష్మీపార్వతి.. 'మోహన్ బాబు దుర్మార్గుడు' అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె అలా ఎందుకు అన్నారో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించబోతున్నట్లు సమాచారం. అలా అయితే ఈ చిత్రంలో మోహన్ బాబు క్యారెక్టర్ విలన్ గా చూపించబోతున్నారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.