భారత దేశంలో కొంత కాలంగా పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఓవైపు స్నేహ పూరిత మాటలు మాట్లాడుతూనే మరోవైపు విషాన్ని కక్కుతుంది. భాతర దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ-కాశ్మీర్ లో అలజడి సృష్టిస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 43 మంది సైనికులు అమరులయ్యారు. గత 20ఏళ్ల కాలంలో ఇంత దారుణమైన దాడి జరిగిన దాఖలాలు లేవని భద్రతా సిబ్బంది చెబుతున్నారు.
జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ అవంతిపురా సమీపంలోకి రాగానే ఈ దాడి జరిగింది. జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ దాదాపు 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొట్టాడు. దాంతో భారీ విస్పోటనంతో వాహనాలు చెల్లాచెదురయ్యాయి. పుల్వామా దాడి ఘటనపై యావత్ భారత దేశం తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో పుల్వామా దాడి నేపథ్యంలో ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది. పాకిస్థాన్ నటీనటులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. నిజానికి 2016లో ఉరి దాడి జరిగినప్పటి నుంచే పాక్ నటీనటులపై నిషేధం విధించడం ప్రారంభించారు. తాజాగా పాక్ నటీనటులపై పూర్తి నిషేధించాలన్న నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు.
ఒకవేళ ఎవరైనా పాక్ కళాకారులను తీసుకుంటే.. వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ నిర్ణయంతో ఇక నుంచి బాలీవుడ్లో పాక్కు చెందిన ఆర్టిస్టులెవరూ కనిపించరు. ఈ ఉగ్ర దాడి తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇందులో సినిమా ఇండస్ట్రీ కూడా పాలుపంచుకుంది. ఒక రోజు పాటు అన్ని షూటింగ్లను నిలిపేసింది.