మరికొన్నిరోజుల్లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ అసలు జీవిత కథ అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో కలకలం సృష్టిస్తూనే ఉన్నారు.
తాజాగా ఆయన ఈ రెండు సినిమాలపై ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. ఆ పోల్ రిజల్ట్స్ తన ట్విట్టర్లో పోస్టు చేసి హంగామా చేస్తున్నారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఏదంటూ వర్మ ట్విట్టర్లో పోల్ నిర్వహించారు.
వర్మ పెట్టిన పోల్ కు నెటిజన్లు భారీగా స్పందించారు. మొత్తం 41, 734 ఓట్లు వచ్చాయి. ఇందులో 85 శాతం లక్ష్మీస్ ఎన్టీఆర్కు ఓటు వేశారు. మహానాయకుడికి కేవలం 15 శాతం నెటిజన్లు మాత్రమే ఓటేశారు. ఈ పోల్ రిజల్ట్ను పోస్ట్ చేసిన వర్మ.. సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్ అంటూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడి ప్లాప్ కావడంతో బాలయ్య చిరాకులో ఉన్నారు. సినిమా వల్ల చెడ్డపేరు రావడమే కాకుండా నిర్మాత కూడా తనే కావడంతో ఆర్థికంగానూ నష్టపోయారు. ఇప్పుడు పుండు మీద కారంలా ఈ ఆర్జీవీ ఒకడు.. పాపం.. గాయాన్ని ఇంకా కెలుకుతూ ఇబ్బంది పెడుతున్నాడు.