టాలీవుడ్ లో యూత్ క్రేజీ హీరోగా అతి తక్కువ సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తనదైన మేనరీజంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. ఈ సినిమా బోల్డ్ డైలాగ్స్ ఉన్నా, కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నా యూత్ కి బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘గీతా గోవిందం’సినిమాలో అమాయకమైన కుర్రాడి పాత్రలో కనిపించి కడుపుబ్బా నవ్వించాడు.
ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. తర్వాత వచ్చిన టాక్సీవాలా కూడా మంచి హిట్ కావడంతో విజయ్ దేవరకొండతో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ గా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుల లీడర్ గా కనిపించబోతున్నాడట...అంతే కాదు ఏడెనిమిది సంవత్సరాల పిల్లాడికి తండ్రిగా కనిపిస్తాడట. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ అప్పుడే ఇలాంటి ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం విశేషం.
ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కొంతవరకు పూర్తయ్యింది. విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా,కేథరిన్ , ఐశ్వర్య రాజేశ్ , ఇజబెల్లి కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రిగా నటించడం ఒక ఎత్తైతే.. ఆయన సరసన నలుగురు కథానాయికలు నటిస్తుండటం మరో విశేషంగా చెబుతున్నారు. కేఎస్ రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు