తెలుగు ఇండస్ట్రీలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నెల 22 న ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ సీన్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్, బసవతారకం మధ్య ఈ సీన్ నడుస్తుంది. "నా ప్రాణానికి ప్రాణంగా, నా బిడ్డలకు తల్లిగా, నా సహధర్మచారిణిగా... నీ అనుమతి కావాలి తారకం... ఇష్టమేనా?" అని ఎన్టీఆర్ అడుగగా, "నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా" అని బసవతారకం చెబుతుండటం ఇందులో కనిపిస్తుంది.
క్యాన్సర్ తో బాధపడుతున్న బసవతారం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, బాధతో అద్దంలో నుంచి ఎన్టీఆర్ చూస్తుండటం, ఆపై "ఈ పాట నీకూ ఇష్టమేనా బావా?" అని భార్య అడుగగా, "నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా తారకం?" అని ఎన్టీఆర్ ప్రశ్నిస్తుండటం కనిపిస్తుంది. తాజాగా ఈ ప్రోమోకి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. బాలకృష్ణ, విద్యాబాలన్ భావోద్వేగాలు చక్కగా పండాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.