టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఊపిరితిత్తుల వ్యాధితో నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి కి గురయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణ ఎప్పుడు నవ్వుతూ..నుదిటిపై ఓ బ్యాండ్..చేతులకు తాళ్లు, వేళ్లకు ఉంగరాలతో కనిపిస్తూ ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో వీటి గురించి ఆయనకు ప్రశ్న ఎదురైనపుడు వాటిని ఎందుకు వాడుతున్నాడో వివరించారు.
కెరీర్ మొదలు పెట్టినపుడు తన రెండో సినిమా బీచ్ లో షూట్ చేస్తున్నుడు ఎన్టీఆర్ గారి కాస్ట్యూమర్ మోకా రామారావుగారు తన వద్దకు వచ్చారని..మీ నుదురు చాలా విశాలంగా ఉంటుందని, ఎండ ప్రభావం తీవ్రంగా పడుతుందని చెప్పి తన జేబు రమాలు ఇచ్చి కట్టుకోమని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత ఆయనే ఓ బ్యాండ్ లా తయారు చేసి నాకు ఇచ్చారు. అప్పటి నుంచి నేను నుదిటిపై బ్యాండ్ కట్టుకుంటూ షూటింగ్ స్పాట్ కి వెళ్లేవాడినని చెప్పారు. ఆనాటి నుంచి షూటింగ్ లో బ్యాండ్ కట్టుకోవడం తన సెంటిమెంట్ అయిందని చెప్పారు.
పోలీసులకు టోపీ, రైతులకు తలపాగా ఎలాగో... తనకు బ్యాండ్ అంత పవిత్రమైనదని తెలిపారు. ఇక చేతినిక కంకనాలు ఎందుకు దరిస్తానంటే..తనకు చిన్న తనం నుంచి దైవ భక్తి ఎక్కువ అని, తన అమ్మమ్మ పొద్దున్నే నాలుగు గంటలకు కాలువకు తీసుకెళ్లి, స్నానం చేయించి, అక్కడి నుంచి గుడికి తీసుకెళ్లేదని కోడి రామకృష్ణ చెప్పారు.
అందుకే దేవుడిపై భక్తితో చేతికి తాడు, కంకణాలు కట్టుకోవడం అలవాటైందని చెప్పారు. తనకు కొంత మంది జ్యోతిష్యులు మంచి స్నేహితులని వారు సూచన మేరకు చేతికి ఉంగరాలు ధరించడం ఆనవాయితీగా పెట్టుకున్నానిన తెలిపారు. కోడి రామకృష్ణ మృతిపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.