టాలీవుడ్ లోకి స్టార్ హీరోల కొడుకులు హీరోగా వస్తున్న సమయంలో నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. కెరీర్ మొదట్లో ప్రేమ కావాలి - లవ్లీ సినిమాలతో ఆకట్టుకున్న ఆది సాయి కుమార్ ఆ తరువాత మరో సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు ఒక ఫిక్షనల్ స్టోరీతో రాబోతున్నాడు ఈ యువ హీరో. అదే ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఆది సాయికుమార్, శషా చెట్రి జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్.
వినాయకుడు టాకీస్ బ్యానర్పై యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 'వినాయకుడు'.. 'కేరింత' వంటి చిత్రాలతో దర్శకుడిగా సాయికిరణ్ అడివి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. ఒక ఎన్ఎస్ జీ కమాండోగా ఆది ఈ సినిమాలో కనిపించనున్నాడు. కార్తీక్ రాజు,నూకరాజు,కృష్ణుడు,అబ్బూరి రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల తదితర ఆర్టిస్ట్సులతో పాటు, టెక్నీషియన్స్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.
సినీ రచయితగా మంచి పేరున్న అబ్బూరి రవి, ఈ సినిమాలో 'ఘాజీబాబా'పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆయన పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను త్రివిక్రమ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అబ్బూరి రవి లుక్ ఆకట్టుకునేలా సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా వుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు తెలియజేశాడు.