ఈ మద్య సినీ ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ లో మొదలైన మీ టూ ఉద్యమం బాలీవుడ్ కి పాకింది. తనూ శ్రీ దత్త ప్రముఖ నటులు నానా పటేకర్ తనని పదేళ్ల క్రితం లైంగిక వేధింపులకు గురి చేశారని సంచలన ఆరోపణలు చేయడంతో బాలీవుడ్ ఒక్కసారే షేక్ అయ్యింది. ఆ తర్వాత పలువురు నటీమణులు తమపై జరిగిన లైంగి వేధింపులు, అత్యాచారాల గురించి బహిరంగంగా చెప్పడం మొదలు పెట్టారు. ఇక దక్షిణాదిన మీ టూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద..తమిళ రచయిత వైరముత్తు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అప్పటినుంచి వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా చిన్మయిని కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తప్పించారు. తాజాగా తన పరిస్థితిని వివరిస్తూ, కేంద్ర మంత్రి మేనకాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీలను ఫిర్యాదు చేసింది. `మేడమ్.. నాపై వైరముత్తు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసి నాలుగు నెలలవుతోంది. అయినా నాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. పైగా నన్ను కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తప్పించారు.
ప్రస్తుతం ఈ ఘటనపై కేసు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు న్యాయం చేయండ`ని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి మేనకాగాంధీని ట్యాగ్ చేస్తూ చిన్మయి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై మేనకా గాంధీ స్పందించారు. ‘మీ కేసును ఎన్సీడబ్ల్యూ (జాతీయ మహిళా కమిషన్) దృష్టికి తీసుకెళ్లాను. మీ వివరాలను నాకు పంపించండి’ అని పేర్కొన్నారు.