ఎన్నికల్లో రాజకీయ పార్టీ నాయకుల హామీలు కొత్తేమి కాదు. ఇప్పటికే జగన్, చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. వారికేమి నేను తీసిపోనని పవన్ కూడా హామీలు కురిపించాడు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్నారో ప్రకటించారు. ముఖ్యంగా రైతులపై వరాల జల్లు కురిపించారు. ఎకరాకు రూ.8వేల పంటల పెట్టుబడి సాయంతో పాటు 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు రూ.5వేల పింఛను అందిస్తామని ప్రకటించారు.
ఎన్నికల వేళ..జనసేన అధినేత తాము అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసారు. రైతులకు 8వేల పంట పెట్టుబడితో పాటుగా 60 ఏళ్లు పై బడిన సన్న..చిన్న కారు రైతులకు అయిదు వేల ఫించను అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటు రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందజేస్తామని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. యువత, మహిళలకు భరోసా కల్పిస్తూ హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టిన తొలి ఆరునెలల్లో లక్ష ఉద్యోగాలు.. ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాల కల్పనే తమ పార్టీ లక్ష్యమని ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే మొదట ఉద్యోగాల కల్పన పై దృష్టి సారిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అదే విధంగా.. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు చెల్లించే లా నిర్ణయం తీసుకుంటామననారు. ఏపిలో ఎవరూ లంచం అడగని వ్యవస్థ రూపకల్పన చేస్తామన్నారు. విద్యార్ధుల కోసం డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వోద్యోగుల కోసం సీపీ ఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.