అమ్మ పురచ్చితలైవి జయలలిత పేరుతో తమిళనాడులో మూడు నాలుగు బయోపిక్ లు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టాలీవుడ్, బాలీవుడ్ లో పలు బయోపిక్ సినిమాలు వచ్చాయి. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్ణించిన జయలిలత టాలీవుడ్, కోలీవుడ్ లో గొప్ప నటి. ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా అన్నాడీఎంకే అధ్యక్షురాలిగా దాదాపు 14 సంవత్సరాలకి పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఆమె ప్రవేశ పెట్టిన పథకాలతో ఎంతో మంచి పేరు సంపాదించి అందరిచేత అమ్మ అని పిలుపించుకుంది. చనిపోయే వరకు జయలలిత కుమారిగానే ఉంది. తాజాగా సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్గా ఉండే కంగనా రనౌత్ ఇటీవల మణికర్ణిక అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాదు కంగనా నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. తాజాగా తాను జయలలిత బయోపిక్లో నటించేందుకు సిద్దమైంది.
తలైవీ అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజయ్ తెరకెక్కించనున్నాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ న్యూస్ ను అధికారికంగా ప్రకటించారు. మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మరోవైపు తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తుంది. నిత్యామీనన్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, పేపర్ టేల్ పిక్చర్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది.