హాలీవుడ్ నుండి బాలీవుడ్ కు దిగుమతి అయి ఆతరువాత దక్షిణాది సినిమా రంగాన్ని కూడ ఒక కుదుపు కుదిపిన 'మీటూ' ఉద్యమం పై ఎన్నో చర్చలు జరగడమే కాకుండా మరెందరో ప్రముఖ సెలెబ్రెటీల చుట్టూ ఈ వివాదం చుట్టుముట్టింది. గత కొంత కాలంగా ఈ విషయమై మీడియాలో వార్తలు తగ్గిపోయాయి. 

అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల మూవీ ధర్మమా అనీ మళ్ళీ ఈ మీటూ ఉద్యమం జనానికి గుర్తుకు వచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. దీనికి కారణం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీస్తున్న సినిమాలో విలన్ గా నానా పటేకర్ ను తీసుకున్నట్లుగా వార్తలు రావడం. ఈ బాలీవుడ్ నటుడు గత సంవత్సరం తనుశ్రీ దత్తాను వేధించాడు అంటూ వార్తలు రావడంతో బాలీవుడ్ లో ఇతడికి మంచి నటుడుగా పేరు ఉన్నా అవకాశాలు బాగా తగ్గాయి. 

అయితే ఇతడి పై వచ్చిన వివాదాలను లెక్క చేయకుండా త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీలో ఇతడికి ఒక కీలక పాత్రను క్రియేట్ చేసి ఆపాత్రలో ఇతడి చేత నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నాడు అని వస్తున్న వార్తలు చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి కొందరైతే వివాదాలకు దూరంగా ఉండే త్రివిక్రమ్ ఈ వివాదాస్పద నటుడికి ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు. 

గతంలో త్రివిక్రమ్ నితిన్ తో 'ఆ ఆ' సినిమా తీస్తున్నప్పుడు సంగీత దర్శకుడు అనిరుధ్ ని ఎంపిక చేసి ఆతరువాత అతడి పై కొన్ని వివాదాలు వచ్చిన పరిస్థుతులలో అతడిని ఆసినిమా నుంచి తొలిగించి వేసాడు. ఇప్పుడు కూడ నానా పటేకర్ పై గతంలో వచ్చిన వివాదాలను కొందరు గుర్తుకు చేస్తున్న నేపథ్యంలో అతడి స్థానంలో మరో నటుడుని ఎంపిక చేస్తాడా లేదంటే ఇలాంటి వివాదాలను తాను పట్టించుకోనని సంకేతాలు ఇస్తాడా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: