భారత దేశంలో కొంత కాలంగా మహిళలకు భద్రత లేకుండా పోయిందని ప్రతిరోజూ మహిళా సంఘాలు గొంతెత్తి అరుస్తున్నారు..దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. చాలా సంఘటనలో జూనియర్ ఆర్టిస్టులు, నటీమణులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చత్తీస్ గఢ్ లో నటిగా, మోడల్ గా ఎదుగుతున్న ఆంచల్ యాదవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై తేలింది. అరగంటలో ఇంటికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన ఆమె.. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతకడం ఆరంభించారు.
అయితే ఆంచల్ యాదవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై తేలింది. రాయ్ పూర్ సమీపంలోని ఓ చెరువులో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో, వారు నటి మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా, గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. అనంతరం శవానికి రాయి కట్టి గురూర్ ప్రాంతంలోని చెరువులో పడేశారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా సోషల్ మీడియాలో ప్రకటన ఇవ్వడంతో ఆంచల్ తల్లి వెంటనే స్పందించి అది తన కుమార్తె శవమేనని చెప్పింది. పోలీసులు ఆమె సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్ కాల్స్ను పరిశీలిస్తున్నారు.
ఆమె కడుపులో కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయని, హత్య తర్వాత ఆమె శవం పైకి తేలకుండా రాయిని కట్టి చెరువులో పడేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని తెలిపారు పోలీసులు. గతంలో ఆంచల్ కు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవని, అప్పట్లో ఓ వీడియోతో అతడిని బ్లాక్ మెయిల్ చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు ఆంచల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేసినట్టు తెలుస్తోంది.