ఈ మద్య కొన్ని చిత్రాలు రిలీజ్ కాకముందు ఎన్నో కష్టాల పాలవుతున్నాయి. ఆ మద్య సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె నటించిన ‘పద్మావత్’ రిలీజ్ కి ముందు ఎన్ని ఇబ్బందులు పడింతో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో తమ మనోభావాలు దెబ్బ తీస్తున్నారని..ఒక వర్గం వారు దేశ వ్యాప్తంగా నిరసనలు, విధ్వంసాలకు పాల్పపడ్డారు. అన్ని అవరోధాలు దాటుకొని పద్మావత్ థియేటర్లో రిలీజ్ కావడం..ఈ చిత్రం చాలా అద్భుతమని ఆ వర్గం వారే ఎంతో బాగా మెచ్చుకున్నారు. ఇక కంగనా రౌనత్ నటించిన ‘మణికర్ణిక’పై కూడా చాలా విమర్శలు, నిరసనలు వెల్లువిరిసాయి.
ఈ చిత్రం కూడా అన్ని అవరోధాలు దాటుకొని థియేటర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, అగస్త్య సంయుక్తంగా దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేటర్లో దుమ్మురేపుతుంది. ఈ చిత్రం ముహూర్తం మొదలు నిన్న రిలీజ్ అయ్యే వరకు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ వచ్చింది. అయితే ఈ చిత్రం రిలీజ్ కాకుండా టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు..కానీ కోర్టు మాత్రం ఈ చిత్రం రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోలేమని తీర్పు ఇచ్చింది.
అయితే ఏపిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఏపిలో తప్ప తెలంగాణ తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ కి ముందు రాంగోపాల్ వర్మ తన ప్రమోషన్ లో ఏం చెప్పారో కళ్లకు కట్టినట్టు చూపించారు. తొలి షో నుంచే సినిమాకు పాజిటిల్ టాక్ రావటంతో కలెక్షన్లు కూడా భారీగా ఉన్నాయి. చాలా థియేటర్లలో కథానాయకుడు సినిమా కలెక్షన్ల కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ వసూళ్లే ఎక్కువగా ఉండటం విశేషం.
ప్రముఖ ఫిలిం వెబ్ సైట్ ఐయండీబీ లో ట్రెండింగ్ తెలుగు మూవీస్ లిస్ట్(రియల్ టైం పాపులారిటీ)లో లక్ష్మీస్ ఎన్టీఆర్ టాప్ లో నిలిచింది. 54.2% పేజ్ వ్యూస్తో బాహుబలి, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను కూడా వెనక్కి నెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ సాధించటం విశేషం. ఇదే లిస్ట్లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ చిత్రాలే ఏవీ లేకపోవడంతో ఈ చిత్రం భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.