ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులే కాదు..వారి తరుపు నుంచి ప్రచారం చేస్తున్నవారు కూడా ప్రత్యర్థి పార్టీవారిపై నోటికి వచ్చింది పేలుతున్నారు. ఇక ఈసారి ఏపి ఎన్నికల్లో సినీ నటుల జోరు నడుస్తుంది..రాజకీయవేత్తలకు తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా సినీ నటులు కూడా తమ వంతుగా ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ తరపున దివ్యవాణి, వైసీపీ తరపున అలీ కూడా ఉన్నారు. ఇప్పటికే దివ్యవాణి పలు సందర్భాల్లో వైసీపీ నేతలపై తనదైన మాటల తూటాలు వదులుతున్నారు. ఈ సందర్భంగా దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్యాకేజీ తీసుకుని వైసీపీలో అలీ చేరారంటూ విమర్శించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కమెడిన్ , వైసీపీ నేత అలీ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. దివ్యవాణి నటనలోనే కాదు..పార్టీ ప్రచారంలో కూడా అతి చేస్తుందని..తానే వైసీపీలో చేరే ముందు ప్యాకేజీ తీసుకున్నట్టు మీరేమైనా చూశారా? లేక సెల్ఫీ తీశారా? అంటూ ప్రశ్నించారు.
అలా అయితే మీరు కూడా టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కదా..మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో సెలవిస్తే బాగుంటుందని ప్రశ్నించారు. తాను ప్యాకేజీ తీసుకున్నట్లు నిరూపించాలని..నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే సహించబోమని దివ్యవాణి ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.