కొంత కాలం క్రితం అల్లు అర్జున్ పేరు చెపితే పవన్ అభిమానులు విపరీతంగా అసహనానికి లోనయ్యేవారు. అయితే పరిస్థుతులు మారిపోయి అల్లు అర్జున్ పవన్ ల మధ్య దూరం తగ్గింది అన్న సంకేతాలు రావడంతో కొంత వరకు పవన్ అభిమానుల కోపం బన్నీ పై తగ్గింది. 

ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటలలో ముగింపుకు వస్తున్న పరిస్థుతులలో అల్లు అర్జున్ ఇస్తున్న ఫినిషింగ్ టచ్ పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ఉదయం బన్నీ రాజమండ్రికి విమానంలో వచ్చి అక్కడ నుండి తన అభిమానులతో పెద్ద ర్యాలీగా కొనసాగి పాలకొల్లు వెళ్లి అక్కడ పవన్ ను కలిసి తన సంఘీభావం తెలియచేయబోతున్నాడు. 

ఇప్పుడు ఈ న్యూస్ పవన్ అభిమానుల మధ్య అనేక చర్చలకు తావు ఇస్తోంది. కొద్దిరోజుల క్రితం చరణ్ పవన్ ను విజయవాడలో కలిసి ఎటువంటి ఎన్నికలప్రచారం చేయకుండా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చి ప్రత్యేకంగా పవన్ కోసం పాలకొల్లు వెళ్ళుతూ ఉండటం పై పవన్ వీరాభిమానులలో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడ కలుగుతోంది. 

పాలకొల్లు అల్లు అర్జున్ స్వస్థలం అవ్వడమే కాకుండా అతడి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గణనీయంగా ఉన్నాయి. దీనితో పవన్ కు సంఘీభావం తెలుపుతూ అల్లు అర్జున్ చేయబోతున్న ప్రకటన కాపు సామాజిక వర్గంలోని యువత మీద కొంత వరకు ప్రభావం చూపెడుతుందా అన్న ఆశలు పవన్ అభిమానులలో కలుగుతున్నాయి. అదే జరిగితే పవన్ పోటీ చేస్తున్న భీమవరం స్థానంలో నాగబాబు పోటీ చేస్తున్న నర్సాపురం స్థానంలో వీరిద్దరి పరిస్థితి కొంత వరకు మెరుగుపడే ఆస్కారం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: