సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ అన్ని అపశకునాలే ఎదురువుతూ వచ్చాయి. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడిని కించ పరిచే విధంగా ఉందని ఇలాంటి చిత్రాలు ఎన్నికల సమయంలో రిలీజ్ అయితే ఓటర్లపై ప్రభావం ఉంటుందని టీడీపీ శ్రేణులు అభ్యంతరాలు తెలిపాయి. రాజకీయ లబ్ధి కోసం రూపొందించి విడుదల చేస్తున్నారంటూ, వెంటనే ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని ఒక పిల్, మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గత నెల 28న విచారించింది.
అయితే గత నెల 29 న తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో విడుదల చేశారు. అయితే ఏపిలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ చిత్రం విడుదల నిలిపివేశారు. తాజాగా హైకోర్టులో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై విచారణ జరిగింది. ఈ చిత్రాన్ని జడ్జిలు, న్యాయవాదులు, సినీ నిర్మాత వీక్షించారు. తాజాగా ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు అభ్యంతరం చెప్పింది.
ఈ చిత్రం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అంతే కాదు తెలంగాణలో సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఉద్యమసింహం', ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథతో రూపొందిన 'పీఎం మోదీ' చిత్రాల విడుదలకు కూడా ఈసీ నో చెప్పింది. కాగా, ఈ మూడు సినిమాలను ఎన్నికల సమయంలో రిలీజ్ చేయవద్దంటూ గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి.