పుత్రోత్సాహము తండ్రికి
పుత్రులు జన్మించినపుడు పుట్టదు,
జనులా పుత్రుని కనుగొని పొగడగ…అన్నట్లు మాత్రం కథానాయకుడు, మహా నాయకుడైన ఎన్టీఆర్ జీవితంలో ఆ తృప్తి శూన్యం.
ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన తర్వాత ఆయన జీవితంలోని బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రజలకు తెలిశాయి. ఈ క్రమం లో ఎన్టీ రామారావు కు సన్నిహితంగా, దగ్గరగా ఉండే వారు సైతం మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలను పంచుకునే ప్రయత్నం చేశారు.
ఎన్టీ రామారావు వద్ద చాలా కాలం పాటు డ్రైవర్గా పని చేయడంతో పాటు ఆయన చైతన్య రథం నడిపిన లక్ష్మణ్ తాజాగా ఒక ఛానల్ తో రామారావు జీవితంలోని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీ రామారావు తన కుమారుల గురించి చాలా బాధపడుతుండేవారని, తనతో కూడా ఆ విషయాలు చెప్పుకుని బాధపడేవారని తెలిపారు.
ఎన్టీ రామారావు కుమారులు కూర్చొని తినడమే తప్ప, పని చేసి పైకొద్దామనే ఆలోచన ఎవరికీ ఉండేది కాదు. ఈ విషయంలో మాత్రం పెద్దాయన మనసులో చాలా బాధ పడేవారు.
"ఏం లచ్చన్నా! ఎవ్వడూ ప్రయోజకుడు కాలేడు, నా పేరు నిలిపేవాడు ఒక్కడూ లేడు. ఏదో బాలయ్య కొద్దిగా పర్వాలేదు అన్నట్లున్నాడు, కానీ పూర్తి నమ్మకం లేదు” అని చెబుతూ ఒకసారి బాధ పడ్డారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.
మొదటి సారి సీఎం అయినపుడు జయశంకర్ బాబును కూర్చోపెట్టి చాలా చెప్పాడు. ‘‘నువ్వు బయట తిరిగు, ఏ ఫ్యాక్టరీ పెడితే బావుంటుందనే విషయం కనుక్కో, నేను నీకు ఫ్యాక్టరీ పెట్టిస్తాను, ఐదు, పది వేల మందికి భోజనం పెట్టిన వారం అవుతాం. థియేటర్ చూసుకోవడం ఏమిటి? దాన్ని చూసుకోవడం కూడా మీకు చేతకాదు. దానికి ఇంకా ఒక మేనేజర్ ను పెట్టుకుంటారు.'' అంటూ జయశంకర్ బాబు కు పెద్దాయన చెప్పినట్లు లక్ష్మణ్ వెల్లడించారు.
‘‘కొడుకులతో ఎన్టీ రామారావు సుఖపడలేదు. ఆయన్ను చివరి వరకు కష్ట పెట్టారు. కూతురు పురంధరేశ్వరి రోడ్ నెం.13 దగ్గర్లనే ఉండేవారు. అప్పుడప్పుడూ క్యారేజ్ పట్టు కుని వచ్చేవారు. కొడుకులంతా కేవలం డబ్బు కోసమే వచ్చేవారు.'' అని లక్ష్మణ్ తెలిపారు.
“వారికి డబ్బు అవసరం అయినపుడు వచ్చి పెద్దాయన ముందు రెండు చేతులు కట్టుకుని నిలబడేవారు. డబ్బు అవసరం లేనంత వరకు తండ్రిని చూసేందుకు కూడా వచ్చేవారు కాదు. ప్రతి నెల సార్ డబ్బులు కవర్లలో పెట్టి ఇస్తే, నేను, మోహన్ వెళ్లి స్వయంగా అందరికీ ఇచ్చి వచ్చేవారం.' అని లక్ష్మణ్ తన ఙ్జాపకాల దొంతరను కదిలించి చెప్పుకొచ్చారు.