మొన్నటి వరకు ఏపిలో ఎలక్షన్స్ గోల ఓ రేంజ్ లో కొనసాగిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు నువ్వా..నేనా అనే విధంగా కొనసాగాయి. ఎన్నికల సందర్బంగా కోట్ల బెట్టింగ్..నడిచింది. ఇక రాబోయే ఫలితాలపై కూడా కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయి. సీఎం పీఠం పై తామే కూర్చుంటామని అధికార పార్టీ..లేదు ప్రజలు అనూహ్యమైన తీర్పు ఇవ్వబోతున్నారు..పీఠం దక్కేది మాకే అని ప్రతిపక్ష పార్టీ..లేదు కింగ్ మేకర్ నేనే అవుతానని జనసేన ఇలా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో ఎన్నికల ఫిలితాలకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైసీపీలో చేరిపోయారంటూ, ఓ మార్ఫింగ్ ఫోటోను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిమానులతో పంచుకోగా, అది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. గతంలో కూడా పలు మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసి వర్మ పోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఈసారి ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా చంద్రబాబు పై వైసీపీ కండు కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో దుమ్మురేపింది.
చంద్రబాబును అవమానించేలా సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టింగ్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా, తన ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల్లో సీఎంను అవమానపరిచేలా మార్ఫింగ్ ఫోటోలను పెట్టారంటూ, ఇదే ప్రాంతానికి చెందిన దేవి వీర వెంకట సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.