మన్మధుడు 2 లో రకుల్ ప్రీతీ సింగ్ నటించడం లేదని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హీరో నాగార్జున - రకుల్ లుక్ విషయంలో అసంతృప్తిగా వున్నాడనీ, బక్క పలచగా మారిపోయిన రకుల్ని కాస్త బొద్దుగా తయారవమని నాగార్జున సూచించాడనీ, ఈ క్రమంలోనే రకుల్తో తీయాల్సిన సీన్స్ ఆగిపోయాయనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అయితే, ఈ గాసిప్స్ని ఖండిస్తూ రకుల్ ప్రీత్ సింగ్, ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. షూటింగ్ స్పాట్కి సంబంధించిన ఫొటో అది.
అందులో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా కన్పిస్తున్నాడు. మరోపక్క, రాహుల్ రవీంద్రన్, సోషల్ మీడియా వేదికగా రకుల్పై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు. 'డే వన్ నుంచీ రకుల్ పనిచేస్తోంది. సినిమా చాలా బాగా వస్తోంది. ఆమె గొప్ప టాలెంట్ వున్న నటి..' అంటూ కితాబులిచ్చాడు రాహుల్ రవీంద్రన్. దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్కి ఇది తొలి సినిమా. 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్, 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారిన విషయం విదితమే. నాగార్జున హీరోగా చాలా కాలం క్రితం వచ్చిన 'మన్మధుడు' చిత్రానికి సీక్వెల్ని ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నాడు.
ఇదిలా వుంటే బాలీవుడ్లో రకుల్ నటించిన 'దే దే ప్యార్ దే' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అజయ్ దేవగన్, టబు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా కోసమే రకుల్ గతంలో ఎన్నడూ లేని విధంగా బక్కపలచగా తయారైంది. రకుల్, రాహుల్ రవీంద్రన్ తాజా ప్రకటనలతో 'మన్మథుడు-2'లోనూ రకుల్ అదే బక్క పలచని లుక్లో కన్పించబోతోందన్న విషయం స్పష్టమయ్యిందన్నమాట.