మెగా కాంపౌండ్కు నమ్మినబంటుగా ఉన్న టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, రాకింగ్స్టార్ దేవిశ్రీప్రసాద్కు అదే కాంపౌండ్ నుంచి ఘోర అవమానం ఎదురైందా ? అంటే టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాకాంపౌండ్కు దేవిశ్రీ అత్యంత నమ్మకస్తుడు. ఇంకా చెప్పాలంటే బాలయ్య శాతకర్ణి, చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఒకేసారి వచ్చినప్పుడు చిరు ఖైదీ కోసం దేవిశ్రీ శాతకర్ణిని వదులుకుని మెగా భక్తి చాటుకున్నాడన్న టాక్ కూడా అప్పట్లో వినిపించింది. మరి అలాంటి దేవిశ్రీకి ఇప్పుడు మెగాకాంపౌండ్ ఎందుకు షాక్ ఇచ్చింది... ఇండస్ట్రీలో వినిపిస్తోన్న ఆ గుసగుస ఏంటో చూద్దాం.
అక్కినేని నవమన్మథుడు అక్కినేని అఖిల్ కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. నాగార్జున ఎన్నో ఆశలతో అఖిల్ తొలి సినిమా అఖిల్ తీయగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత హలో, మూడో సినిమా మజ్ను కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు నాలుగో సినిమా ఎట్టి పరిస్థితిలో హిట్ అవ్వాలని అక్కినేని ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. అఖిల్ నాలుగో మూవీని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ కూడా తేడా కొడితే అఖిల్ కెరీర్ ప్రారంభంలోనే పతనమైనట్టే.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ముందుకు దేవిశ్రీని సెలక్ట్ చేసుకున్నారు. నిర్మాత అల్లు అరవింద్ అండ్ చిత్ర యూనిట్ మాత్రం దేవిని వద్దే వద్దు అన్నారట. ఆ తర్వాత థమన్ అనుకుని ఫైనల్గా గోపీసుందర్ ని ఓకే చేసుకున్నారు. ఏమైందో తెలియదు గాని... అఖిల్కు మార్కెట్ లేదని.. దేవి ఎక్కువగా రెమ్యునరేషన్ అడగడంతో కావాలనే అతడిని పక్కన పెట్టారని అంటున్నారు. బడ్జెట్ లిమిట్ కోసమే అరవింద్ గోపీసుందర్ను తీసుకున్నాడట. అఖిల్ మాత్రం దేవి, థమన్ లకే ఇంట్రెస్ట్ చూపాడట.
ఏదేమైనా అఖిల్ మనసు దేవి, థమన్ మీద ఉంటే... అరవింద్ మాత్రం దేవి అడిగిన రేటు ఇవ్వడం ఇష్టంలేకే గోపీసుందర్ను తీసుకున్నాడని అంటున్నారు. తమకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న దేవిని కేవలం రేటు సాకుగా చూపించి పక్కన పెట్టడం...అది కూడా హీరో అఖిల్ కోరుకున్నాకూడా పట్టించుకోకపోవడం అతడికి మెగా కాంపౌండ్లో ఘోరఅవమానమే అన్న గుసగుసలు ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఫైనల్గా అఖిల్ సినిమాకు క్వాలిటీ అవుట్ ఫుట్ రాకపోతే అతడే నష్టపోతాడనడంలో సందేహం లేదు.