మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు ఆరు వరుస ప్లాపుల తర్వాత ఓ హిట్ కొట్టాడు. చివరిగా సుప్రీమ్ సినిమాతో 2015లో హిట్ కొట్టిన సాయి అప్పటి నుంచి వరుస ప్లాపులతో విలవిల్లాడుతున్నాడు. సుప్రీమ్ తర్వాత సాయి చేసిన విన్నర్ - నక్షత్రం - జవాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి అన్ని ప్లాపులే పలకరించాయి. ఎట్టకేలకు తాజాగా వచ్చిన చిత్రలహరి సినిమాతో ఓ మోస్తరు హిట్ కొట్టాడు. సాయి గత సినిమాలతో పోలిస్తే చిత్రలహరి గొప్ప హిట్ కాకపోయినా ఉన్నంతలో పర్వాలేదనిపించింది.
ఆరు ఫ్లాప్ ల తర్వాత వచ్చిన సక్సెస్ అవ్వడంతో చిత్రలహరి విజయంను తేజ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉన్నాడు. మీడియాకు వరుసగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్లో ఇప్పటి వరకు ఆన్సర్లు ఇవ్వని ప్రశ్నలకు కూడా షాకింగ్ ఆన్సర్లు ఇస్తున్నాడు. ఇక నాగబాబు సాయికి వరుసకు మామ అవుతాడు. ఆయన కుమార్తె నిహారికి సాయికి మరదలు అవుతుంది. ఈ నేపథ్యంలోనే నిహారికను తేజ్ చేసుకుంటాడంటూ ప్రచారం కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో జరుగుతోంది.
ఇక తాజాగా సాయి నిహారికతో తన పెళ్లి వార్తను తోసిపుచ్చాడు. ఇలాంటి వార్తలు తనకు చాలా బాధగా ఉంటాయని... తాము చిన్నప్పటి నుంచి ఒకే చోట కలిసిమెలిసి పెరిగామని... నిహారికను తాను చెల్లిగా భావిస్తాను. చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని ఎవరికి అయినా కాలుతుందని తేజ్ షాకింగ్ రిప్లే ఇచ్చాడు. ఇక ఇప్పటి నుంచి అయినా సాయి-నిహారికి పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో ? చూడాలి. ఇక సాయి నెక్ట్స్ సినిమా మారుతి డైరెక్షన్లో తెరకెక్కనుంది.