నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా స్టార్ హీరోలతో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా మరో తెలుగు ప్రేక్షకు ముందుకు రాబోతుంది. నగేష్ కుకునూర్..'ధనక్' సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఆయన దర్శకత్వంలో ఇంతకు ముందు `హైదరాబాద్ బ్లూస్`, `ఇక్బాల్` చిత్రాలు వచ్చాయి. ఆయన తెలుగు సినిమాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా.. ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ.శివప్రకాశ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తను వెడ్స్ మను ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్, పూణేల్లో షూటింగ్ జరుగుతోంది.