ఎన్నో అంచనాలతో ఈ నెల 9వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఆల్బమ్ సగటు సినీ అభిమానులను కూడా పూర్తిగా నిరాశపరిచింది. రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఇటీవల తన స్థాయికి తగిన మ్యూజిక్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. గత కాలంగా దేవీ ఆల్బమ్లు ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామకు పాత ట్యూన్లే అటూ ఇటూ తిప్పి ఇచ్చేశాడన్న విమర్శలు ఎదుర్కొన్నాడు. గతంలో అందరి హీరోలకి తన మ్యూజిక్తో సూపర్ హిట్లు ఇచ్చిన దేవీ ఇప్పుడు ఆ రేంజ్లో ఆకట్టుకోలేకపోతున్నాడు.
కొద్ది రోజులుగా దేవి సరిగా కాన్సంట్రేషన్ చేయకపోవడమా ? లేదా ? ఇతర కారణాలు ఏంటన్నది తెలియదు కాని... మ్యూజిక్లో మాత్రం పరమ రొటీన్ బాణీలే వినిపిస్తున్నాయ్. ఇక మహేష్ - దేవిశ్రీ కాంబో అంటే శ్రీమంతుడు - భరత్ అను నేను సినిమాలు గుర్తుకు వస్తాయి. వన్ నేనొక్కడినే సినిమా ప్లాప్ అయినా మ్యూజిక్ సూపర్ హిట్. ఆ పాటలు ఇప్పటకీ ప్రేక్షకుల నోళ్లలో నానుతుంటాయి. ఇక లేటెస్ట్గా అదే మహేష్ మహర్షి సినిమాకు మంచి సంగీతం అందిచడంలో దేవీశ్రీప్రసాద్ ఫెయిల్ అవ్వడంలో మహేష్ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు.
ఇప్పటికే మహర్షి ఆల్బమ్ వచ్చేసింది. ఇందులో రెండు సాంగ్స్ మాత్రమే...అది కూడా ఓ మోస్తరుగానే ఉన్నాయి. మహేష్ కెరీర్లో మహర్షి సినిమా 25వ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాకు తగ్గట్లు సంగీతం అందిచడంలో దేవీశ్రీప్రసాద్ ఫెయిల్ అయ్యాడన్న టాక్ ఇండస్ట్రీలో ఒక్కటే చక్కెర్లు కొడుతోంది. మహేష్ అభిమానులు దేవినీ టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇక సాంగ్స్ ఎలాగూ ప్లాప్ అయ్యాయి... ఇక ఆర్ ఆర్తో అయినా మెప్పిస్తాడా ? లేదా ? అన్నది చూడాలి.