తెలుగు ఇండస్ట్రీలో హీరోల తనయుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో ప్రముఖ దర్శకులు ఈవివిసత్యనారాయణ తనయుడు నరేష్ ‘అల్లరి’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం పేరుతోనే అల్లరి నరేష్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కామెడీ హీరోలు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ తర్వాత ఆ స్ధాయిలో కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు నరేష్.
కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో హాస్య చిత్రాల్లో నటించిన నరేష్ చాలావేగంగా ఆయన 50 చిత్రాలు పూర్తి చేశాడు. అలాంటి 'అల్లరి' నరేశ్ కి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దాంతో హీరోగా ఆయన సరైన కథకోసం వెయిట్ చేస్తూనే, కీలకమైన పాత్రలను సైతం చేయడానికి రంగంలోకి దిగాడు. తాజాగా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు నరేష్.
తదుపరి చిత్రం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వుండనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇది మల్టీ స్టారర్ మూవీ అనీ .. ఇందులో మరో హీరో కూడా చేయనున్నాడని చెబుతున్నారు. ఎస్వీఆర్ మీడియా బ్యానర్లో ఈ చిత్రం నిర్మితమవుతుందని అంటున్నారు.