"మహర్షి" సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్రాజు, అశ్వినిదత్, ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ చిత్రంలో "అల్లరి" నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న . ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం సాయంత్రం హైదరాబాద్లో నిర్వహించారు.
ఇక ఈ వేడుకలో మహేష్ తో పనిచేసిన దర్శకులతో పాటు మహేష్ తో పనిచేసిన హీరోయిన్స్, సాంకేతిక నిపుణులు అందరు మహేష్ తో తమకున్న అనుభవాలని ప్రత్యేకంగా పంచుకున్నారు. ఇక మహేష్ కూడా తన కెరీర్ కి ఉపయోగపడిన ప్రతి దర్శకుడిని తలుచుకొని పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అయితే మహేష్ కి సూపర్ స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన చిత్రం "పోకిరి". చలన చిత్ర బాక్సాఫీస్ రికార్డ్స్ ను తిరగరాసిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే ఒక మైలురాయి అని చెప్పొచ్చు. అయితే తనకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పూరి పేరును మహేష్ మరిచిపోవడంతో అందరిలో ఈ విషయం చర్చనీయాంశమైంది.
అయితే ప్రీ రిలీజ్ వేడుక తర్వాత మహేష్, పూరి గురించి ఒక ట్వీట్ ని చేశారు. " నా 25 సినిమాల ప్రయాణంలో "పోకిరి" నన్ను సూపర్స్టార్ను చేసింది. "పోకిరి" లాంటి చిత్రాన్ని నాకు అందించినందుకు పూరీ జగన్నాథ్గారికి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. అయితే దీనికి బదులుగా "ధన్యవాదాలు "మహర్షి’ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ...లవ్ యు" అని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు.