టాలీవుడ్ టాప్ హీరోలు ఏడాదికి ఒక సినిమానే చేయడం గగనంగా మారింది. పవన్కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిపోగా ప్రస్తుతం మహేష్, ప్రభాస్, తారక్, చరణ్, అల్లు అర్జున్ మాత్రం టాలీవుడ్ మూల విరాట్టులుగా చలామణీ అవుతున్నారు. వీరిలో ప్రభాస్ ఇప్పటికే ప్రతి సినిమాకీ రెండేళ్లు తీసుకుంటున్నాడు. తారక్, చరణ్ ఇద్దరూ రాజమౌళి సినిమా చేస్తూ వుండడంతో వీరికి కూడా వచ్చే వేసవి వరకు రిలీజ్ వుండదు.
అల్లు అర్జున్ అయితే ప్రణాళికల్లోనే పొద్దు పుచ్చుతూ కెమెరా ముందుకి మాత్రం వెళ్లడంలేదు. ఇప్పుడు మహేష్ ఒక్కడే వేగంగా సినిమాలు చేయాలనే ఆలోచన చేస్తున్నాడు. మహర్షి ఇంకా విడుదల కాకుండానే తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడితో ఓకే చేసుకున్నాడు. కథల విషయంలో తాత్సారం చేసే సుకుమార్ లాంటి దర్శకులని దూరం పెడుతూ వేగంగా పని పూర్తి చేసేవారికే ఛాన్స్ ఇస్తున్నాడు.
దీనితో మిగతా హీరోలతో పోలిస్తే మహేష్ స్పీడ్ గా సినిమాలో తీసేసి అభిమానులను ఖుషి చేస్తున్నాడు. మిగతా అగ్రహీరోలు కూడా మహేష్లా వేగం పెంచితే బాగుంటుందని సినిమా బిజినెస్పై ఆధారపడ్డవారు అభిప్రాయపడుతున్నారు. పెద్ద హీరోలు ఏడాదికి ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ రెవిన్యూ జెనరేట్ అవ్వటంతో పాటు చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది.