"రాజా రాణి" సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు యువ దర్శకుడు అట్లీ. ఆ తర్వాత ఆయన విజయ్ తో చేసిన "తేరి" "మెర్సెల్" లాంటి చిత్రాలు బాక్స్ ఆఫిస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ -అట్లీ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
విజయ్ నటిస్తున్న 63వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం.
ఇందులో భాగంగా మీనంబాక్కంలోని బిన్నిమిల్లు ప్రాంతంలో ఆలయం, ఆస్పత్రి, మెడికల్ దుకాణాలు, పాఠశాల సెట్ వేశారు. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం సమయంలో షూటింగ్ కోసం కొత్తగా సెట్ వేసే పనిలో కార్మికులు ఇనుప కమ్మీలను వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు అక్కడున్న ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించాయి. క్రమంగా మంటలు సెట్ అంతటా వ్యాపించాయి. వెంటనే కార్మికులు అక్కడినుంచి పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమండలంగా మారింది.
ప్రమాదం జరిగిన సెట్ విలువ లక్షల్లో ఉండంటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాల కొరకు విచారణ చెప్పట్టారు. ఇక ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం.