క్రిష్ .. ప్రతీభావంతుడైనా డైరెక్టర్. అందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ బయోపిక్ ను డీల్ చేసాడో అప్పటి నుంచి క్రిష్ కు బ్యాడ్ లక్ స్టార్ట్ అయ్యింది. అయితే, క్రిష్ తన తరవాత సినిమా తెలుగులో చేయడంలేదని టాక్. ఆయన మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లనున్నారని సమాచారం. క్రిష్‌కు బాలీవుడ్ కొత్తేమీ కాదు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఠాగూర్’ సినిమాను హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా తెరకెక్కించారు.


అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ సినిమాకు దర్శకత్వం వహించారు. అనుకోని కారణాలతో ఈ సినిమా నుంచి చివరి దశలో వైదొలిగారు. అనంతరం పెద్ద వివాదమే నడిచింది. బాలీవుడ్‌లో ఇలాంటి అనుభవం ఎదురైనా మళ్లీ క్రిష్ ఆ బాటే పడుతున్నారు. తనకు మొదట అవకాశం ఇచ్చిన అక్షయ్ కుమార్‌నే మళ్లీ క్రిష్ సంప్రదించారని అంటున్నారు.


ఇప్పటికే అక్షయ్‌కు క్రిష్ కథ చెప్పారట. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే, ఇంకా స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేయలేదని అంటున్నారు. మొత్తానికి క్రిష్ తరవాత సినిమా బాలీవుడ్‌లో చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో చూడాలి. నిజంగా క్రిష్ మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లి తనను తాను నిరూపించుకోగలిగితే ‘మణికర్ణిక’ వల్ల పడిన మచ్చ చెరిగిపోవటమే కాకుండా హిందీ ప్రేక్షకులకు తానేంటో కూడా చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: