ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రియల్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ఏమైంది అంటూ అతడి అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అమితాబ్ నివాసం ‘జల్సా’ ప్రతి ఆదివారం సందడిగా ఉంటుంది. ముంబై జుహు ప్రాంతంలో ఉన్న ఈఇంటికి పలువురు అమితాబ్ ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. తనను చూడడానికి వచ్చిన అభిమానులను ఉత్సాహపరుస్తూ ప్రతి ఆదివారం బయటకు వచ్చి ఆయన అభిమానులను కలుస్తూ ఉంటారు. అయితే నిన్న ఆదివారం అమితాబ్ జల్సా వద్దకు వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది.
అమితాబ్ కనిపించక పోవడంతో అందరూ నిరాశగా వెనుదిరిగారు. బయటకు వచ్చి అభిమానులను పలకరించలేని స్థితిలో అమితాబ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ‘‘ఈ రోజు సండే దర్శన్ కు రావడం లేదు. అనారోగ్యం కారణంగా బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నాను. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ఈ విషయం అందరికీ చెప్పండి' అంటూ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులకు పెట్టిన మెసేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అమితాబ్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నానంటూ చేసిన మెసేజ్ అభిమానులలో కలవరపాటు కలిగిస్తోంది.
తన అభిమానుల ఆందోళన గ్రహించిన అమితాబ్ తన ఆరోగ్యం గురించి ఎవరు ఖంగారు పడనక్కరలేదని మరో మెసేజ్ పెట్టారు. 1982లో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి బయటపడ్డ అమితాబ్ కు ఇలా అప్పుడప్పుయ్ప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది. గత ఏడాది కూడా ఆయన ఆసుపత్రిలో ఈ సమస్య రీత్యా కొన్ని రోజులు ఉన్నారు.
అమితాబ్ బచ్చన్ వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు. తరచూ అనారోగ్యం వేధిస్తున్నా వయసు సంబంధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నటుడిగా ఇంకా యంగ్ హీరోలతో సమానంగా నటిస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు. తాను మరణించే వరకు సినిమాలలో నటిస్తూనే ఉంటానని ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్య అమితాబ్ చెప్పిన మాటలు ఆయన ఆత్మస్థైర్యాన్ని సూచిస్తున్నాయి..