సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాపై కేసీఆర్ ప్రభుత్వం అపారమైన
ప్రేమ చూపించింది. మహర్షి సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 9వ తేదీ నుంచి రెండు వారాల పాటు అంటే 22వ తేదీ వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతులు ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ 14 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 8-11 గంటల మధ్యలో ఒక షో అదనంగా ప్రదర్శించేందుకు తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర
ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజీవ్ త్రివేది మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. నిర్మాత దిల్ రాజు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ 14 రోజుల పాటు టిక్కెట్ల రేట్లను కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
సింగిల్ స్క్రీన్లో రూ.80 టిక్కెట్ ధర రూ.110కు పెంచుకునేలా ఓకే చెప్పారు. ఇక రూ.138 ఉన్న మల్టీఫ్లెక్స్ రేటును రూ.200కు పెంచుకునేలా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఏదేమైనా అటు రెండు వారాల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ఓకే చెప్పడంతో టిక్కెట్ల రేట్లను సైతం విరివిగా పెంచుకునేలా ప్రభుత్వం ఓకే చెప్పడంతో మహర్షిపై కేసీఆర్ సర్కార్ అపారమైన
ప్రేమ చూపించింది.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి సినిమా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించాడు. ఇక స్పెషల్ షోల విషయంలో చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వ అనుమతి కోరగా ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదని సమాచారం.