రాజ్ తరుణ్ తో నిత్యామీనన్ నటించనున్నదని సినీ సర్కిల్ లో వినిపిస్తున్న మాటలు. గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు విజయ్ కుమార్ కొండా. కానీ అంత మంచి ఆరంభాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ద్వితీయ విఘ్నం అతడిని దెబ్బ కొట్టింది. అక్కినేని నాగార్జున అంతటి వాడు పిలిచి తన కొడుకుతో ‘ఒక లైలా కోసం’ తీసే ఛాన్సిచ్చాడు.


కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయి విజయ్ కెరీర్‌ను వెనక్కి లాగేసింది. ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లవుతున్నా ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. తాజా సమాచారం ఏంటంటే.. విజయ్ కుమార్ ఒక చిన్న స్థాయి ప్రేమకథ చేయనున్నాడట. రాజ్ తరుణ్ అందులో హీరో అట. నిత్యామీనన్ హీరోయినట. ఐతే వీళ్లిద్దరూ హీరో హీరోయిన్లు అనగానే ఇదేం జోడీ అనే సందేహం కలగడం ఖాయం. నిత్య కంటే వయసులో రాజ్ చిన్నవాడు.


పైగా ఆమెతో పోలిస్తే అతను సన్నగా కూడా ఉంటాడు. ఇద్దరికీ జోడీ కుదిరే అవకాశాలు లేవు. మరి విజయ్ ఎలా ఈ జోడీని ఎంచుకున్నాడన్న సందేహం కలుగుతుంది. ఐతే ఇదంతా కథలో ఉన్న విశేషం అంటున్నారు. తన కంటే వయసులో పెద్దదైన అమ్మాయిని ప్రేమించే కుర్రాడి కథ ఇదట. కాబట్టే రాజ్, నిత్యలను ఎంచుకున్నాడట విజయ్. కథలోని ప్రత్యేకత, తనకు ‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి హిట్ ఇచ్చాడన్న కృతజ్ఞతతో నిత్య ఈ చిత్రాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సినిమాలే లేని రాజ్ ఈ చిత్రం ఒప్పుకోకుండా ఉండటానికి కారణాలు లేవు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: