మెగా హీరో సాయ్ ధరం తేజ్ తన పేరుని సాయి తేజ్ గా మార్చుకుని చేసిన చిత్రలహరి హిట్ అనిపించుకుంది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అందుకున్న సాయి తేజ్ చిత్రలహరితో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సాయి తేజ్.


లేటెస్ట్ గా సాయి తేజ్ మరో ఎమోషనల్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి డైరక్షన్ లో మెగా హీరో మూవీ కన్ఫాం అయ్యింది. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య సాగే కథ అని తెలుస్తుంది. సినిమాలో తండ్రి పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు మారుతి. 


మీడియం బడ్జెట్ సినిమాలతో అద్భుతాలు చేయగల మారుతి సాయి తేజ్ తో మొదటిసారి కలిసి సినిమా చేస్తున్నాడు. కథ చాలా బాగా వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇన్నాళ్లు మెగా మేనియాతో మాస్ ఫాలోయింగ్ కోసం ప్రాకులాడిన సాయి తేజ్ ఎమోషనల్ కంటెంట్ తో చిత్రలహరి హిట్ కొట్టాడు. మారుతి సినిమాలో కూడా అదే పంథా కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది. 


సాయి తేజ్ లో ఈ మార్పు మంచిదే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. మారుతి ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ లో మారుతి భలే భలే మగాడివోయ్ సినిమా చేశాడు. నాని కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఆ సినిమా ఉంది. ఇక ఇప్పుడు సాయి తేజ్ తో చేస్తున్న సినిమా కూడా అలాంటి ఫలితాన్ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: