భరత్ అనే నేను, మహర్షి వరసగా సినిమాల హిట్ తరువాత మహేష్ బాబు తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు. జూన్ 15 వ తేదీన లాంఛనంగా ప్రారంభించి జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి వరకు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఈ సినిమా తరువాత మహేష్ తో ఎవరు చేస్తున్నారు అనే దానిపైనే అందరి కళ్ళు ఉన్నాయి. మహేష్ 27 వ సినిమా కోసం ఐదుగురు దర్శకులు పోటీలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసిన వ్యక్తి రాజమౌళి. రాజమౌళితో సినిమా చేయాలని మహేష్ బాబు చాలాకాలం నుంచి అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు సెట్ కాలేదు. మహేష్ నెక్స్ట్ మూవీ రాజమౌళితో ఉంటుందని వార్తలు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయట. ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ తో సినిమా చేస్తారని సమాచారం. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జూన్ 30 న రిలీజ్ కాబోతుంది. ఆ తరువాత స్క్రిప్ట్ రెడీ కావాలంటే కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. అంటే ఇప్పటి నుంచి కనీసం రెండేళ్లు ఆగాలి.


త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ కు దర్శకుడిగా ఎదిగే సమయంలో మహేష్ మంచి తోడ్పాటును అందించాడు. అతడు, ఖలేజా వంటి రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్... ఆ తరువాత మహేష్ తో సినిమా చేయలేదు. మహేష్ 27 వ సినిమా కోసం త్రివిక్రమ్ కూడా ప్రయత్నిస్తున్నాడు. అయితే, ప్రసుత్తం త్రివిక్రమ్... అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తైన వెంటనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉంది. అల్లు అర్జున్, మెగాస్టార్ ప్రాజెక్ట్స్ పూర్తికావడానికి మరో రెండేళ్లు పడుతుంది.


మూడో దర్శకుడు సుకుమార్... 26 వ సినిమా సుకుమార్ తో చేయాల్సి ఉన్నా కథ విషయంలో తేడా రావడంతో ప్రాజెక్ట్ పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ కథతో సుకుమార్ బన్నీని లైన్లోకి దించాడు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నది. సుకుమార్ తో ఫ్యూచర్ లో సినిమా ఉంటుందని ఇప్పటికే మహేష్ చెప్పారు. అంటే మహేష్ 27 సినిమా సుకుమార్ తో చేసే ఛాన్స్ ఉండొచ్చు.


అటు అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ కబీర్ సింగ్ సినిమా చేస్తున్నాడు. దీని తరువాత మరో సినిమాకు కమిట్ కాలేదు. మహేష్ తో చేసే అవకాశం ఉండొచ్చు. అదే విధంగా మహేష్ తో సినిమా చేయడానికి లైన్లో ఉన్న మరో దర్శకుడు పరశురామ్. గీత గోవిందం హిట్ తరువాత పరశురామ్ మహేష్ తో సినిమా చేస్తానని ముందుగానే చెప్పాడు. చెప్పినట్టుగా పరశురామ్  మహేష్ కు ఇటీవలే ఓ కథ వినిపించాడని వార్తలు వినిపించాయి.

పరశురామ్ కథకు మహేష్ ఫ్లాట్ అయ్యారని, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. మహేష్ కోసం పరశురామ్ రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. గీత ఆర్ట్స్ సంస్థ మహేష్ తో ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదని మంతనాలు మొదలుపెట్టింది. అన్ని కుదిరితే పరశురామ్ తో సినిమా చెయ్యొచ్చు. ఫైనల్ గా మాత్రం ఎవరు పూర్తి స్క్రిప్ట్ తో మహేష్ ను మెప్పిస్తారో వాళ్ళకే అవకాశం ఇస్తానని మహేష్ నుంచి వస్తున్న ప్రపోజల్. మరి మహేష్ ను ఎవరు మెప్పిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: