ఈమధ్య సినిమా ఆడియో ఫంక్షన్లకి, ప్రీరిలీజ్ ఈవెంట్లకి ఒక హీరో సినిమాకి మరో హీరో గెస్ట్లా రావడం ఆనవాయితీగా మారింది. అది కొంత మందికి సెంటిమెంట్గా అనుకుంటే మరికొందరు వారిద్దరి మధ్య ఉండే స్నేహం కొద్దీ వెళతారు. అదే విధంగా ఇటీవలె విడుదలైన మహర్షి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెంకటేష్ అతిధిగా వెళ్ళారు. దానికి ముందు విడుదలైన జెర్సీ, మజిలీ హిట్ కావడంతో అదేవిధంగా మహర్షి కూడా హిట్ అవుతుందనే నేపథ్యంలో మహేష్ వెంకీని గెస్ట్గా పిలిచారని చిత్ర యూనిట్ చెబుతుంది.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అల్లువారిబ్బాయి అల్లు శిరీష్ హీరోగా వస్తోన్న చిత్రం ‘ఏబిసిడి’ సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల13న హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఈవెంట్ జరుగనుంది. కాగా ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర సమర్పకులు. మెగాబ్రదర్ నాగబాబు, బాల నటుడు భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మంచి హిట్ కోసం ఎప్పటినుంచో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్న అల్లు శిరీష్ ఈ సినిమాతో భారీ హిట్ కొడతాడేమో చూడాలి. మరి నేచరల్ స్టార్ నాని మంత్రం ఏమాత్రం శిరీష్కి హెల్ప్ అవుతుందో చూడాలి.