టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాన్ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా తర్వాత హీరోగా తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. వరుస విజయాలతో పవర్ స్టార్ గా ఒక్క వెలుగు వెలిగిపోయారు. గబ్బర్ సింగ్ తర్వాత ఆయన ‘జనసేన’పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి లిమిటిగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాన్ చివరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి. ఈ సినిమా తర్వాత ఏపిలో ఎన్నికలు రావడంతో జనసేన పార్టీ తరుపు నుంచి ఆయన ముమ్మరంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
ఆయన సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ తరుపు నుంచి ఎంపీగా పోటీలో నిలబడ్డారు. తాజాగా నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..2009లో ప్రజారాజ్యం తరఫున ఓటమిని ఫేస్ చేశామని నాగబాబు తెలిపారు. అప్పుడు తమ సన్నద్ధతకు, ఇప్పుడున్న సన్నద్ధతకు తేడా స్పష్టంగా ఉందన్నారు. ఈసారి జనసేనకు ఓటేయాలన్న భావన ప్రజల్లో బలంగా కనిపించిందని అభిప్రాయపడ్డారు. అతన్ని ఎంత అణగదొక్కాలని చూస్తే..అంతకు వంద రెట్లు పైకి లేస్తాడని అన్నారు.
పవన్ కల్యాణ్ ను ఎవరు విమర్శించినా అది ఆయనకు ప్లస్ అవుతుందని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతాననీ, సినిమా చేయనని పవన్ కల్యాణ్ గతంలోనే చెప్పారని నాగబాబు గుర్తుచేశారు. ఇక పవన్ కళ్యాన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు..ఎన్టీఆర్, చిరంజీవి ఇలా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటించారు. ఎవరికీ ఇక్కడ ప్రత్యేకమైన రూల్ అంటూ ఏమీ ఉండదు కదా అన్నారు.