జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో 2015లో వచ్చిన 'టెంపర్’ తో తిరిగి జూనియర్ హిట్ ట్రాక్ మీదకు వచ్చాడు. ఈమూవీకి మంచి పేరు రావడంతో ఈమూవీని హిందీలో రణవీర్ సింగ్ హీరోగా 'సింబా' పేరుతో రీమేక్ చేయగా ఆ మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీనితో ఈ సినిమా ద్వారా తిరిగి హిట్ ట్రాక్ లోకి రావాలని కోలీవుడ్ హీరో విశాల్ 'అయోగ్య' పేరుతో రీమేక్ చేసాడు.
గతవారం తమిళనాడులో విడుదల అయిన ఈమూవీ పై సుమారు నాలుగు సంవత్సరాలు తరువాత ఇప్పుడు కాపీ ఆరోపణలు రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తమిళ నటుడు దర్శకుడు పార్తీబన్ ఈ ఆరోపణలు చేశాడు. 1993లో వచ్చిన తన క్రైమ్ థ్రిల్లర్ ‘ఉల్లే వెలియే' చిత్ర కథను ఎత్తేసి 'టెంపర్' మూవీ చేశారని పార్తీబన్ ఆరోపణలు చేస్తున్నాడు.
అయితే ఈ కాపీ వివాదం పై ఫిర్యాదు చేసే ఆలోచనకానీ కేసులు పెట్టే ఉద్దేశ్యం కానీ తనకు లేదని ఈతమిళ నటుడు చెపుతున్నాడు. అంతేకాదు ‘అయోగ్య' చిత్రంలో పార్తీబన్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. తాను నటించిన సినిమా పై తనకు తానే ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
దీనితో ఈసినిమా పై తమిళ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడానికి ఇలా ఈమూవీ నిర్మాతలు పార్తీబన్ చేత వ్యూహాత్మకంగా మాట్లాడిస్తున్నారు అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసినిమాకు సంబంధించి మాతృక అయిన ‘టెంపర్’ మూవీ రచయిత వక్కంతం వంశీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈవిషయమై స్పందించవలసి ఉంది..