ఈ మ‌ధ్య సినిమాల్లో హీరో హీరోయిన్లే కాక డైరెక్ట‌ర్లు కూడా అప్పుడ‌ప్పుడు క‌నిపించ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. ఏదో ఒక చిన్న‌ సీన్‌లో అయినా స‌రే త‌ళుక్కుమంటుంటారు కొంత‌మంది ద‌ర్శ‌కులు. ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా అవతారం ఎత్తనున్నారు. అభిమానులకు ఎంతో సర్ ప్రయిజ్ కలిగించిన ఈ వార్త త్వరలోనే నిజం కాబోతోంది. అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా వచ్చిన 'ఠాగూర్'లో ఓ గుర్తుండిపోయే పాత్రను చేసిన‌ వినాయక్, ఇప్పుడు సోలో హీరోగా పరిచయం కాబోతుండగా, దీన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తుండటం గమనార్హం.
 'శరభ' ఫేమ్, గతంలో శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌ నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.  మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వ‌ర్గాలు తెలిపాయి.. గతేడాది సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'ఇంటెలిజెంట్‌' తరువాత వినాయక్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే గ‌తంలో ఫ్యామిలీ సినిమాల ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న ఎస్‌.వి. కృష్ణారెడ్డి కూడా రెండు చిత్రాల్లో న‌టించారు. అభిషేకం, ఉగాది లాంటి చిత్రాల్లో న‌టించారు. న‌టుడుగా ప‌ర్వాలేద‌నిపించుకున్న ఆ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తాకొట్టాయి. మ‌రి ఇప్పుడు వి.వి.వినాయ‌క్‌ని ప్రేక్ష‌కుల ఆద‌రిస్తారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: