‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తన సత్తాను చూపించింది శ్రద్ధ శ్రీనాథ్. తమిళంలో సూపర్ హిట్టయిన శ్రద్ధ తొలి సినిమా ‘విక్రమ్ వేద’ కూడా తనకి ప్రత్యేకమైన సినిమానే. ఇక సొంత భాష కన్నడలో శ్రద్ధ నటించిన ‘యు టర్న్’ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేయగా సమంత లీడ్ రోల్ చేసింది. ఐతే ‘జెర్సీ’ ప్రమోషన్ల సందర్భంగా తెలుగు ‘యు టర్న్’ చూశారా అని శ్రద్ధను అడిగితే..తన పాత్రలో మరొకరిని చూడలేనని.. ఒరిజినల్లో తానే బెస్ట్ పర్ఫార్మర్ అంటూ  కామెంట్ చేసి సంచలనం రేపింది శ్రద్ధ. సమంత స్థాయి కథానాయిక గురించి ఇలా నెగెటివ్ గా మాట్లాడి టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. 


ఇక ఇప్పుడు శ్రద్ధ ఒక తమిళ సూపర్ హిట్ సినిమాలో సమంతనే రీప్లేస్ చేయబోతుండటం విశేషం. సమంతకు గత ఏడాది వేసవిలో మరపురాని మూడు విజయాలు దక్కాయి. అందులో 'ఇరుంబు తిరై'ఒకటి. విశాల్ హీరోగా పి.ఎస్.మిత్రన్ రూపొందించిన ఈ సైబర్ థ్రిల్లర్ తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్టయింది. సమంతకు కూడా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్లు విశాల్ ప్రకటించాడు. 


ఈ సినిమాలో విశాల్ హీరోగా, అలాగే విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ కొనసాగుతున్నరు. కానీ.. హీరోయిన్ మాత్రం మారనుంది. సమంత స్థానంలోకి శ్రద్ధ వస్తోంది. ఇప్పటికే అజిత్ తో కలిసి ‘పింక్’ రీమేక్ లాంటి క్రేజీ మూవీలో నటించే అవకాశం దక్కించుకున్న శ్రద్ధ.. ఇప్పుడు 'ఇరుంబు తిరై'రీమేక్ రూపంలో మరో క్రేజీ కాంబినేషన్లో నటించనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: